Sunday, June 12, 2022

తెలుగు రాష్ట్రాల్లో చర్చలు!

క్రిందటి వారం, ఆంధ్ర ప్రదేశ్ లో 10 వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కేవలం 67% మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ పరిస్థితి కి దారి తీసిన పరిణామాలు  అనేకం, కానీ ఆ కారణాల గురించి చర్చ మాత్రం శూన్యం. పరీక్షలు నిర్వహించే సమయానికి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత చర్చనీయాంశం - కొత్త సినిమా రిలీజ్ కి టికెట్ ధర ఎంత ఉంచాలి? సోషల్ మీడియా లో అత్యంత చర్చనీయాంశం - ఏ హీరో ఎంత గొప్పోడు, అవతల హీరో ఎంత తిక్కొడు. 

పిల్లలకి ఇంగ్లీష్ మీడియం లో చదువు నేర్పించాలి అని జగనన్న చెప్పాక, ఒక నలుగురు విద్యార్థులను తీసుకు వచ్చి, వాళ్ళతో అమెరికన్ యాస లో మాట్లాడించి జేజేలు కొట్టించుకోవడం జరిగింది. అదే స్కూల్ లో 57% మంది పాస్ అయ్యారు 10వ తరగతి. 

ఫెయిల్ అయిన విద్యార్థుల తో zoom మీటింగ్ పెట్టారు లోకేష్ బాబు. ఆ మీటింగ్ కి వైకపా ఎమ్మెల్యే ఇద్దరు వచ్చి రభస చేద్దాం అని ప్రయత్నించారు. ఇప్పుడు చర్చ అంతా మళ్ళీ ఈ ఎమ్మెల్యే ప్రవర్తన మీదే! 

ఈ ఒక్క విషయమే కాదు... ఇలా ప్రజలకి సంభందించిన ఏ విషయం పైనా చర్చించడం చాలా కష్టం అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో చర్చలు విందాము అంటే, బూతులు తప్పించి వేరే వినిపించవు. రాజధాని ఎక్కడో ఎంటో తెలియని అగమ్య గోచరం లో ప్రజలు ఉంటే, అసెంబ్లి లొ వీళ్ళు ఒకరిని ఒకరు తిట్టుకోవడం లో బిజీ అయిపోయారు. 

చాలా ఏళ్ళ తరువాత విద్యుత్ కోతలు వచ్చాయి. పరిశ్రమలకు "విద్యుత్ సెలవు" ప్రకటించాల్సిన దుస్థితి మళ్ళీ వచ్చింది. ఇదేదో చరిత్ర తిరగరాసే నిర్ణయం అనుకున్నారు వైసీపీ మిత్రులు. "జగన్న మార్కు పరిపాలన" అని సోషల్ మీడియా మీద కాసేపు నోరు జారారు కూడా! కానీ ఈ విషయం మీద కూడా మళ్ళీ చర్చ శూన్యం. ప్రజలు ఏదో ఆగ్రహం కి గురి అవుతారు అనుకుంటే, వాళ్ళు ఆగ్రహించిన విషయం ఏమిటో తెలుసా? కోనసీమ జిల్లా కు  పేరు మార్చి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పెట్టినందుకు ఇళ్లని తగలపెట్టరు. 

దేశం మొత్తం లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు. కేంద్రం తగ్గించినా , 23 రాష్ట్రాలు తగ్గించినా, మన తెలుగు రాష్ట్రాల మొండి ఘటాలు మాత్రం ఒక్క పైసా కూడా తగ్గించలేదు. ఎందుకు తగ్గించాలి అని మళ్ళీ ఎదురు దాడి కీ దిగారు! 

కెసిఆర్ గారు అయితే ఏకంగా నేను అసలు ఎప్పుడూ పెంచలేదు అని పచ్చి అబ్బద్దం కూడా చెప్పేశారు. 2015 లో 4% పెంచారు కదా అని చూపిస్తే, అది అసలు పెంపే కాదు అని దబాయించి తప్పించుకున్నారు. జగనన్న అయితే ఏకంగా పత్రికా ప్రకటనలు చేశారు - కేంద్రం ఎంత సంపాదించింది చెప్పారు కానీ, రాష్ట్రం ఎంత సంపాదించింది సెలవు ఇవ్వలేదు. 

ప్రజల మీద పడుతున్న భారం సరిపోవటం లేదు అని అనిపించింది కెసిఆర్ గారికి. వరసు పెట్టి వివిధ రకమైన టాక్స్ పెంచుతునే పోయారు. ఈయన పెంచిన ప్రతి సారి, మోడీ ని తిడతారు అదేంటో! మోడీ నీ మాత్రమే కాదండోయ్, బీజేపీ లో అందరికి తిట్లు పడతాయి కెసిఆర్ నుంచి.  నిజంగానే తిడతారు అండి -  కుక్కలు, గాడిదలు, సిగ్గులేని బ్రతుకులు, మేడలు నరుకుతాం... ఇలా అడ్డు అదుపు లేకుండా తిడుతూనే ఉంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీ అయితే "రండ మంత్రి" అని కూడా సంభోదించారు మన సారు! 

పలు రంగాల్లో అభివృద్ధి లో ముందు ఉండే తెలుగు రాష్ట్రాల్లో చర్చలు మాత్రం ఎందుకు అధోగతి లో ఉంటాయి? ఎందుకు మన మీడియా లో చర్చలు తక్కువ, అరవడం ఎక్కువ ఉంటాయి? చేపల మార్కెట్ లో ఉండే గోల కంటే టీవీ స్టూడియో లో ఉండే గోల ఎక్కువగా ఉంటది ఎంటో! ఈ పరిస్థితి మారాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే పరీక్షలు పాస్ అయినా సరే, సమాజం లో ఫెయిల్ అవుతారు పిల్లలు! వాళ్ళకి సరైన దారి చూపించే బాధ్యత ఇకనైనా మీడియా మరియు ప్రజా ప్రతినిధులు తీసుకోవాలి!


0 comments:

Post a Comment